కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలెప్పి వద్ద కారు, బస్సు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మెడికల్ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి భారీ వర్షంలో వేగంగా వచ్చిన కారు కాలర్ కోడ్ వద్ద ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. కారులో తీవ్రగాయాలపాలైన విద్యార్థులంతా లోపలే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది కారును కట్ చేసి మృతులు, క్షతగాత్రుల్ని కారులో నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మృతులను దేవనందన్, లక్షద్వీప్ కు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం, ఆయుష్ షాజి, శ్రీదీప్ వాల్సన్, మొహమ్మద్ జబ్బర్ గా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా టీడీ మెడికల్ కాలేజీ లో మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించారు.