మహారాష్ట్ర రాజధాని ముంబైలో బస్సు బీభత్సం సృష్టించింది. అకాస్మాత్తుగా వేగంగా రోడ్డు పక్కన నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద నలిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరవైకి పైగా జనాలు గాయపడ్డారు. పలు వాహనాలు, దుకాణాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. కుర్లా వెస్ట్ లోని ఎస్జీబా ర్వే మార్గ్ లోని అంజమ్-ఇ-ఇస్లాం పాఠశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముందుగా బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావించారు. అయితే బస్సు బ్రేకులు సరిగానే ఉన్నాయని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.