తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి పట్టుబడటం కలకలం రేపుతోంది. తాజాగా నగరంలో పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు విదేశీ గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద ఓ వ్యక్తిని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 170 గ్రాముల విదేశీ గంజాయి, ఒక కిలో లోకల్ గంజాయి, బైక్, సెల్ఫోల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరులోని డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న శివరామ్గా గుర్తించారు. శివరామ్ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గంజాయిని హైదరాబాద్కు అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అజయ్ సైతం భాగమైనట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి వీకెండ్స్ లో గంజాయి బిజినెస్ చేస్తున్నట్లు వివరించారు. బెంగళూరులో గంజాయి కొనుగోలు చేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్కు సరఫరా చేస్తున్నారని తెలిపారు. వీరిద్దరూ ఎవరెవరికి గంజాయి విక్రయిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.