ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు సూపర్ ఫ్లాప్ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనన్నారు.సీఎం చంద్రబాబు సోమవారం ఇచ్చిన ప్రజెంటేషనే ఇందుకు నిదర్శనమన్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని విమర్శించారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలంటున్నారని, చంద్రబాబు తీరు మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుందని ఎద్దేవా చేశారు.నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారన్నారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని, 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని, కోటిన్నర మంది మహిళలను మోసగించారని, 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల పాలైందని చెబుతూనే అడ్డగోలు హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం తెలియదా అని, ‘సూపర్ సిక్స్’ పథకాల రూపకల్పనలో కనపడలేదా ఆర్థిక భారం కనిపించలేదా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను గెలిపిస్తే వంద రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే కదా అని నిలదీశారు. ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని, పథకాల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.