పలు నాటకీయ పరిణామాల నడుమ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. 26 మంది కార్పొరేటర్ల మద్దతుతో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. దీంతో మునికృష్ణ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీకి ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కార్పొరేటర్లు అనీశ్ రాయల్, అమరనాథ్ రెడ్డి, మోహన కృష్ణలు టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.
ఎన్నికల తర్వాత ట్విస్ట్…
టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల అనంతరం మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన కాళ్లు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ.. తమను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.