వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ హెచ్చరించారు. ఇకపై జగన్ 2.0 చూస్తారని, ఈ 2.0 వేరేగా ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైయస్ జగన్ విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజల కోసం పని చేస్తూ కార్యకర్తలను పట్టించుకోలేకపోయానన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న కష్టాలు చూస్తున్నానని చెప్పారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సహజమని, ఈ కష్టాలు ఎల్లకాలం ఉండవని అన్నారు. కార్యకర్తలకు సమస్యలు ఎదురైనప్పుడు తన కథ గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కలిసి తనపై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. అయినా ప్రజల ఆశీస్సులతో సీఎం అయినట్లు తెలిపారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా 99 శాతం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెవరేర్చుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వినగలుగుతున్నాం అని స్పష్టం చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకులు కూడా సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇద్దామంటే ప్రజలకు నిలబెట్టుకోలేని వాగ్ధానాలు చేసి మోసం చేయడం తప్పు అని చెప్పినట్లు వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. కూటమి నేతలంతా సూపర్ సిక్స్ అంటూ దొంగ హామీలతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. గత తొమ్మిదేళ్ల పాలన గురించి తీవ్ర విమర్శలు చేశారు.