బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించిన తాజా చిత్రం ఛావా. మరాఠా మహారాజు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన సతీమణిగా రష్మిక నటనకు జనం ఫిదా అయ్యారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఛావాపై ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడ చూసినా ఛావా సినిమా గురించే వినిపిస్తోందన్నారు. మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని చెప్పారు. మహారాష్ట్ర, ముంబై నగరం కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలోనూ కీలకపాత్ర పోషించాయన్నారు. ఛావా సినిమా గురించి మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్కు చెందిన దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు.