వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతోందని పార్టీ అధినేత వైయస్ జగన్ పేర్కొన్నారు. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైయస్ జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ పుట్టిందని జగన్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందని, వైసీపీ మాటిస్తే తప్పకుండా చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలిగించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఏడాది గడిచిపోయిందని, మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని పేర్కొన్నారు. వైసీపీకి ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదని, గతంలో పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్కు ఏడాదికి రూ.2800 కోట్లు, వసతి దీవెనకు రూ.1100 కోట్లు కావాలని కానీ ప్రభుత్వం గతేడాది రూ.700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. వైసీపీ ఎల్లప్పుడు ప్రజల తరఫున పోరాడుతుందని, పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.