ఏపీ రాష్ట్ర పరిస్థితులు, అప్పులు, సూపర్ సిక్స్ లపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ సీఎం వైయస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైయస్ జగన్ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్కు చేరుకుంటున్నాయన్నారు. చంద్రబాబు పీ4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడుతున్నాడని, సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తానంటున్నాడని , అసలు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని నిలదీశారు. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలుంటే అందులో 1.48 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులున్నారన్నారు. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్కంట్యాక్స్ కడుతున్నారని, ఆయన చెప్పిన ప్రకారం 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలని చెప్పారు. చంద్రబాబు చెప్పేవి, చేసేవి అన్నీ మోసాలేనని ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టడానికే రాష్ట్ర అప్పులపై చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్ముతానని, పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నానన్నారు. వాస్తవానికి ఎన్నికలను టీడీపీ వదిలేయాలి కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారన్నారు. కష్టకాలంలో పార్టీ పట్ల కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చూపిస్తున్న నిబద్ధతకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.కార్యకర్తల కోసం బలంగా పోరాడతానని హామీ ఇచ్చారు.