వైసీపీ అధినేత వైయస్ జగన్ నేడు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం అయింది. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువులు ఈ హత్య చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైయస్ జగన్
పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.