ఏపీలో గంజాయి పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి అక్రమ రవాణా దారులు, వినియోగదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలు చోట్ల గంజాయి వినియోగం కొనసాగుతూనే ఉంది. దీంతో పాటు గంజాయి వినియోగదారులు మత్తులో ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనే జరిగింది.
తిరుపతి దగ్గర్లోని ఓటేరులో ఓ గంజాయి బ్యాచ్ విధ్వంసం సృష్టించారు. స్థానిక రైల్వే ఉద్యోగి వాసుదేవ నాయుడు ఇంటి వద్దకు వచ్చి ఆయన భార్య చైతన్యపై దాడికి దిగారు. దుండగుల దాడిలో చైతన్యకు స్వల్ప గాయాలయ్యాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. ఇటీవల ఓ వాకర్పై కూడా ఇలాగే గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ దాడులను తట్టుకోలేక కొంతమంది కుటుంబాలతో సహా ఆయా ప్రాంతాల నుంచి వేరే ప్లేస్కు షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఈ దాడులను సీరియస్గా తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.