ఏపీలోని తిరుపతిలో పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. నగరంలోని లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు జైలుశిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పూనుకొందని అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేటు హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు హోటళ్లలో తనిఖీలు చేపట్టాయి. పోలీసుల తనిఖీల్లో ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. సదరు బాంబు బెదిరింపులపై అలిపిరి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.