బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల సినీ తారల మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ కేసులతో సతమతమవుతున్నారు. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోలు ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై కేసు నమోదైంది. వీరిపై రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారని సమాచారం. ఫన్ 88 బెట్టింగ్ యాప్ కి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోషన్స్ చేశారని ఈ ప్రమోషన్స్ వల్ల చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటీటీ ప్లాట్ఫాం ఆహాలో వచ్చే అన్ స్టాపబుల్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్, గోపీచంద్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారని, ఈ ఎపిసోడ్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో బెట్టింగ్ ఆడి రూ.83 లక్షలు పోగొట్టుకున్నానని ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లపై కేసు నమోదైంది. మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.