కేజీఎఫ్… ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్గా నటించిన మొదటి సినిమాతోనే శ్రీనిధి శెట్టి ప్యాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి, పలు బ్యూటీ కాంటెస్ట్ లలో పాల్గొన్ని విజయం సాధించింది. ‘కేజీఎఫ్’ మూవీతోనే హీరోయిన్గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’లో యశ్ సరసన నటించి ప్యాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకుంది. ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్ తర్వాత ‘కోబ్రా’ మూవీతో తమిళంలోకి శ్రీనిధి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యింది. శ్రీనిధి శెట్టి డెబ్యూ చేస్తున్న ‘తెలుసు కదా’ మూవీ విడుదల అవ్వకముందే అప్పుడే తెలుగులో రెండో అవకాశం కూడా దక్కించుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’తో హిట్ కొట్టిన నాని సరసన నటించడానికి శ్రీనిధి సిద్ధమవుతోంది. నాని ఇప్పుడు ‘హిట్ 3’పై ఫోకస్ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హిట్ 3’లో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించనుంది. ఈ నాని, శ్రీనిధి పెయిర్ చాలా ఫ్రెష్గా ఉంటుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చేసింది. మరి కేజీఎఫ్ భామ టాలీవుడ్లో ఎలా నిలదొక్కుకుంటుందో వేచి చూడాలి.