బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట‌ర్ల‌కు హ‌డ‌ల్‌!

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కు ఎంద‌రో యువ‌కులు బ‌లైపోయారు. ఈ అంశాన్ని తెలంగాణ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసిన ఇన్ ఫ్య్లూయ‌న్స‌ర్లు, న‌టులు, యూట్యూబ‌ర్ల గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కొంద‌రు సెల‌బ్రెటీల మీద ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద కేసు నమోదు చేశారు. యూట్యూబ‌ర్ హర్షసాయి, న‌టి విష్ణుప్రియ, ఇన్‌ఫ్ల్యూయ‌న్స‌ర్లు సుప్రిత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి వారిపై కేసు నమోదైంది. పోలీసుల విచారణలో స‌ద‌రు వ్య‌క్తులు సోషల్ మీడియా వేదిక‌గా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని యువ‌త‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు తేలింది. ఇప్ప‌టికే పోలీసులు విష్ణుప్రియ‌, టేస్టీ తేజ వంటి వాళ్ల‌కు నోటీసులు పంపించి విచార‌ణ‌కు పిలిచారు. మ‌రింత మందిని విచారించే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లువురు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ, బెట్టింగ్ యాప్స్ ను ప్ర‌మోట్ చేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *