ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ హీరోయిన్లలో ఎందరో తెలుగు సినిమాల్లో కూడా అడపాదడపా నటించి తమ లక్ పరీక్షించుకున్నారు. ఈ కోవలో కత్రినా కైఫ్, కంగనా రనౌత్, దీపికా పడుకొణె, ఆలియాభట్ లాంటి తదితర తారలున్నారు. మరో వైపు తాజాగా కరీనా కపూర్ ప్రభాస్ సినిమాలో నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగులో క్రేజీ ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్లో పాగా పాతేసిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఆమె ఇప్పుడు మహేశ్ బాబు – రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ క్యారెక్టర్కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఈ సినిమా నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రియాంకా చోప్రా అయితే ఈ క్యారెక్టర్కు న్యాయం చేయడంతో పాటు మూవీ మార్కెట్కు కలిసొస్తుందని జక్కన్న ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రియాంకా ఈ మూవీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉందని టాక్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు విదేశీ తారలు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.