ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఇప్పటికీ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. నేటి వరకు సుమారు 60 కోట్లుకు పైగా ప్రజలు కుంభమేళాకు హాజరయ్యారు. ముగింపు వేళ కుంభమేళాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సుమారు 15000 మంది పారిశుద్ధ్య కార్మికులు చీపురు పట్టి కుంభమేళా పరిసర ప్రాంతాలను క్లీన్ చేశారు. ఇప్పటికే 10 వేల మంది కార్మికులు గత కుంభమేళాలో పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు గిన్నిస్ రికార్డు ఉంది. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక ముగింపు రోజైన ఫిబ్రవరి 26న శివరాత్రి ఉన్నందున భక్తులు భారీ ఎత్తున తరలివస్తారని అధికారులు వెల్లడించారు.