ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలనుకున్న ఆ విద్యార్థి బతుకు అర్ధాంతరంగా ముగిసింది. దేశం కాని దేశంలో దిక్కులేని వాడిగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన విద్యార్థిని రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్గా గుర్తించారు. వివరాళ్లోకి వెళ్తే… కేశంపేట మండలానికి చెందిన గంప రాఘవులు-రమాదేవిల కొడుకు ప్రవీణ్ కొంతకాలం కిందట పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు. విస్కాన్సిన్ మిల్వాంకిలో ఉంటూ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన రోజూవారీ ఖర్చుల కోసం ఓ హోటల్లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. ప్రవీణ్ ఉండే ఇంటికి దగ్గర ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రవీణ్కు బుల్లెట్ తగిలింది. తీవ్ర రక్తస్రావం జరిగి ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్ మృతి చెందిన విషయాన్ని అతడి స్నేహితులు ప్రవీణ్ తల్లిదండ్రులకు తెలియజేశారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతితో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.