హైదరాబాద్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హోటల్కు వెళ్లిన ఓ యువకుడిని కుక్క తరమడంతో భయంతో మూడో అంతస్తు పై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. చందానగర్లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెనాలికి చెందిన ఉదయ్(23) అనే యువకుడు కుటుంబంతో కలిసి రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆదివారం తన స్నేహితులతో సరదాగా గడిపేందుకు చందానగర్లోని వీవీ ప్రైడ్ హోటల్లో రూమ్ తీసుకున్నారు. హోటల్ మూడో అంతస్తులో స్నేహితులతో కలిసి బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఉదయ్ వెంటపడింది. దీంతో ఉదయ్ కారిడార్లో అటు ఇటు పరుగులు పెట్టాడు. చివరికి కుక్క నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాకపోవడంతో హోటల్ కిటికీ నుంచి బయటకు దూకేశాడు. దీంతో ఉదయ్కి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా ఉదయ్ అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.