ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికను బెదిరిస్తూ ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామానికి చెందిన పులివర్తి ప్రశాంత్ అలియాస్ బన్నూ అదే గ్రామానికి చెందిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి, బెదిరించి లోబర్చుకున్నాడు. ఇప్పటికే బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా అత్యాచారం విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.