సీఎం రేవంత్ రెడ్డిపై న‌టి మాధ‌వీల‌త ఘాటు వ్యాఖ్య‌లు

టాలీవుడ్‌, తెలంగాణ స‌ర్కార్ మ‌ధ్య న‌డుస్తున్న నాట‌కీయ ప‌రిణామాల‌పై సినీ న‌టి మాధ‌వీల‌త సీఎం రేవంత్ రెడ్డి పై సోష‌ల్ మీడియా వేదిక‌గా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అల్లు అర్జున్ చేసింది నేరం కాద‌ని, తెలియ‌కుండా జ‌రిగిన త‌ప్పు అని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై బ‌న్నీ స‌రిగా స్పందించ‌క‌పోవ‌డం కూడా పొర‌పాటేన‌ని వ్యాఖ్యానించారు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంద‌న్నారు. ఇటీవ‌ల మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశార‌ని, దాని గురించి మాట్లాడిన‌ అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీలని నిలదీస్తారా? అని ప్ర‌శ్నించారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యుల కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని ఓ రైతు లేఖ రాసి ఉరేసుకున్నాడ‌ని, వారి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు కాక‌పోయినా క‌నీసం రూ.25 వేలు అయినా ఇచ్చారా అని నిల‌దీశారు. పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారా అని సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీపై ఉక్కు పాదం మోపాలి, వాళ్ల‌ని కాళ్ల‌ కింద పెట్టుకోవాలని చూస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. గురుకుల విద్యార్థులు ఎంతోమంది చ‌నిపోతే క‌నీసం మాట్లాడిన పాపాన పోలేద‌న్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ నాడు సినీ పెద్ద‌ల‌తో దండం పెట్టించుకున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి సీఎం స్థాయికి ఎదిగి గ‌లీజుగా చేస్తున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *