ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుచేస్తే వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆ లేఖలో పేర్కొంది. పౌర విమానయానానికి, వాయుసేన విమానాల రాకపోకలకు అనుగుణంగా ఉమ్మడి ప్రయోజనాలు సమకూర్చుకునేందుకు అవసరమైన భూములు సమకూర్చుకోవాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరినట్టు వాయుసేన తెలిపింది. నిజాం కాలంలోనే భారత వాయుసేన విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్న రన్వేను అభివృద్ధి చేయడంతో పాటు టెర్మినల్ సహా ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సాధారణ ఎయిర్ పోర్టుకు ఇప్పుడున్న స్థలం సరిపోతుందని, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే 1,592 ఎకరాల స్థలం అవసరమని గతంలోనే అధికారులు గుర్తించారు. దీని కోసం మళ్లీ భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. దీనిపై మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ… దీనికి అవసరమైన భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై చర్చించేందుకు త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.