ఏపీలో జీతాల పెంపు కోసం అంగన్ వాడీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారు. విజయవాడ అలంకార్ సెంటర్లో మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అంగన్ వాడీలు విజయవాడకు తరలివస్తున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ధర్నా కేంద్రానికి ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ ఇప్పికే వందల సంఖ్యలో అంగన్వాడీలు ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. విజయవాడతో పాటు పలు జిల్లాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ అంగన్వాడీలు ధర్నా కేంద్రానికి చేరుకోకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. జీతాలు పెంచాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.