ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి–రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీపై చంద్రబాబు ఎక్స్ లో పోస్టు పెట్టారు. డిసెంబర్లో వైజాగ్ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తామని.. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, అమిత్ షా, నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు.