ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్తో పవన్ సమావేశమయ్యారు. నేడు ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పలు పథకాలు, నిధులు విడుదల చేయాలని మంత్రులకు వినతిపత్రాలను అందజేశారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని కొనసాగుతున్న దాడులను కలిసికట్టుగా ఎదుర్కొందామని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ తన పోస్టులో.. ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి ‘చిన్మోయ్ కృష్ణ దాస్ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ అందరం కలిసికట్టుగా పోరాడుదాం. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించబడింది, మన వనరులు ఖర్చయ్యాయి, మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మా హిందూ సోదరులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకున్న తీరు మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఈ విషయంలో యూఎన్వో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.