తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.6 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ఇంకా ఆశ, ప్రేమ ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం అన్నారు. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.