ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తమ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు, నాణ్యమైన విద్య, వైద్యం అన్నీ బంద్ అవుతాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్నీ ఆపేస్తారని తెలిపారు. సామాన్య ప్రజలకు నెలకు రూ.25 వేల వరకు ఖర్చులు పెరుగుతాయని చెప్పారు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ చూశారని, ఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.