తెలంగాణలో ఆశా కార్యకర్తల ఆందోళన ఉద్ధృతంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి భారీ ఎత్తున చేరుకొని ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, ఆశా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా కార్యకర్తలు గాయపడ్డారు.
ఆశాల డిమాండ్లు ఇవే…
ఆశా కార్యకర్తలు తమ వేతనాన్ని కనీసం రూ.18,000 కు పెంచాలని, కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఆర్థిక భరోసా కింద రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.50 వేల సహాయం, విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం నగదు అందించాలని కోరుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఈఎస్ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.