తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ సుందరీకరణపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ సర్కార్ భారీ దోపిడీకి స్కెచ్ వేసిందని ఆరోపించారు. మూసీ ముసుగులో పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఈ సందర్భంగా రేపు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మూసీ బాధితులు భారీ ఎత్తున ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు మూసీ పేరుతో కాంగ్రెస్ రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎంలా వాడుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైగా ఉందని, గత పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక, హామీలు నెరవేర్చలేకపోతోందని చెప్పారు.