కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ శత్రుత్వాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. వైజాగ్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ వీఎంఆర్డీఏ ఎరీనాలో జరిగిన ప్రధాన మంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని కోరారు. కేంద్రం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. కేంద్రం జనదన్ ఖాతాల నుంచి విడుదల చేసే ప్రతీ రూపాయి పేదల చేతుల్లోకి వెళ్తోందన్నారు. భారత్ నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, శక్తివంతమైన దేశ నిర్మాణం కోసం రోజ్ గార్ మేళాలో అపాయింట్ మెంట్ లెటర్స్ పొందిన వాళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు.