ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వెళ్లిన ఓ ఖాతాదారుడి దగ్గర దొంగ నోట్లు ఉండటం కలకలం రేపింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు. రెండు రోజుల క్రితం అతను కుంచనపల్లిలో నగదు డిపాజిట్ చేశాడు. డిపాజిట్ చేసిన నోట్లలో రూ.18 వేలు దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్లో మొత్తం నగదు జమ కాలేదు. తాను రూ.50,000 డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించగా అందులో రూ.18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అధికారులు ఆరా తీయగా ఖాతాదారుడు జమ చేసిన సొమ్ములో రూ.18 వేల దొంగ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజిబాబుకు ఆ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.