రాష్ట్రంలో ఏక్ పోలీసింగ్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న భారీ ఎత్తున తరలి వచ్చిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. నేడు బెటాలియన్ కానిస్టేబుల్స్ యూనిఫాం వేసుకొని మరీ ఆందోళన చేపట్టడం సంచలనంగా మారింది. వరంగల్లోని మామునూరు ఫోర్త్ బెటాలియన్లో కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు. బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. తక్షణమే రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నల్గొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ రూరల్ ఎస్సై సైదాబాబును సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. సైదాబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడని ఆరోపించారు. తక్షణమే సైదా బాబుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.