వివాహేతర సంబంధం ఓ మహిల ప్రాణం తీసింది. కుటుంబసభ్యుల సూచనతో ప్రియుడిని దూరం పెట్టినందుకు ఏకంగా ఆ ప్రియుడు పెట్రోల్ పోసి ఆమెను హత్య చేసేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఈ నెల 6న మెదక్ పట్టణానికి చెందిన రేణుక (45) అదృశ్యమైంది. ఆమె కుమారుడు శ్రీనాథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు రేణుక ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. రేణుక తన పక్కింట్లో ఉండే యేసు(40) అనే వ్యక్తితో పలు మార్లు ఫోన్ మాట్లాడినట్లు గుర్తించారు. పోలీసులు యేసును విచారించగా హత్య వ్యవహారం బయటపడింది. రేణుక భర్త మృతి చెందగా ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో యేసుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కుటుంబసభ్యులు మందలించడంతో యేసుతో మాట్లాడటం మానేసింది. రేణుక దూరాన్ని తట్టుకోలేని యేసు ఆమెను హత్య చేయాలనుకున్నాడు. మందు తాగుదామని రేణుకను చిన్న శంకరంపేట మండలంలోని కొండాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రేణుకతో కలిసి మద్యం తాగి ఆమె మత్తులో ఉన్నప్పుడు కత్తితో పొడిచాడు.అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొ రిమాండ్కు తరలించారు.