టీజీ జెన్కోలో ఏం జరుగుతుంది?

టీజీ జెన్కోలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించారు. త‌మ‌కు అపాయింట్ మెంట్ ఆర్డ‌ర్స్ ఇవ్వ‌క‌పోవ‌డంపై జెన్‌కో ఆఫీస్ వ‌ద్ద నిరుద్యోగులు ధ‌ర్నాకు దిగిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్పందించారు. అభ్య‌ర్థుల‌కు అపాయింట్మెంట్ లెటర్లు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. జెన్కో, ఏఈ, కెమిస్ట్ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఎదురు చూపులు ఎంత‌కాలం అని నిల‌దీశారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, గ్రూప్ 4 అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి, వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేద‌న్నారు. మంత్రిని నాలుగు సార్లు కలిసినా పట్టించుకోలేద‌ని చెప్పారు. పరీక్ష పెట్టి, ఫలితాలిచ్చి, వెరిఫికేషన్ చేసి, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని , ఆఖరికి బాండ్ పేపర్ కూడా రాయించుకొని రోడ్ల మీద వదిలేస్తరా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్లు ఏం పాపం చేశార‌ని నిల‌దీశారు. వీళ్లు తెలంగాణ ప్రాంతీయులు కాదా అని ప్ర‌శ్నించారు. సర్వ శిక్ష అభియాన్ టీచర్ల మాదిరిగా, రోడ్ల మీద టెంట్లు వేసుకొని వీళ్లు కూడా ధర్నాలు చేయాలా అని అన్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అంటే ఇదేనా అని ప్ర‌శ్నించారు. ఇలాగే ఉంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పారదోలడం ఖాయం అని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *