తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదీస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై ఉక్కు పాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, కొత్త ఉద్యోగాలు రావడం లేదని, నిరుద్యోగభృతి ఇవ్వలేదని విమర్శించారు. అధికారం కోసం అశోక్ నగర్ గడప తొక్కారని, అధికారం దక్కిన తర్వాత నిరుద్యోగుల గొంతునొక్కారని పేర్కొన్నారు. న్యాయం కోసం నిలదీసిన దళితరైతు వెంకటయ్య అరెస్టు చేశారన్నారు. దళిత రైతు అభిప్రాయం తీసుకున్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్ లను జైలుకు పంపారన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఇంటి మీద దాడికి యత్నించారన్నారు. రాజ్యాంగం పట్టుకుని దేశంలో తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అరాచక కాంగ్రెస్ పాలన కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులని, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులు అని పేర్కొన్నారు.