రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది కక్ష్యా? శిక్ష్యా? నిర్లక్ష్యమా? అంటూ మండిపడ్డారు. పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని నిలదీశారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా అంటూ మండిపడ్డారు. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా అన్నారు. కేసీఆర్ గారి పాలనలో దేశానికి ఆదర్శంగా ఉన్న గురుకులాలపై నేడు అంతులేని నిర్లక్ష్యం అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.