– కారుతో ఢీకొట్టి హతమార్చిన వ్యక్తి
– జగిత్యాలలో రోడ్డుపై ధర్నాకు దిగిన జీవన్ రెడ్డి
జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిని ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తీవ్ర గాయాలపాలైన సదరు వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డిని జగిత్యాల జిల్లా జాబితాపూర్ వద్ద ఆదివారం ఉదయం సంతోష్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల పాత బస్టాండ్ వద్ద తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ నాయకులకే రక్షణ లేనప్పుడు తామెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. జగిత్యాలలో బీఆర్ఎస్ సర్కార్ నడుస్తోందా అని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. గంగారెడ్డికి ప్రాణహాని ఉందని ముందే చెప్పినా పోలీసులు ఏం చేస్తున్నారని డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. నిందితుడు సంతోష్పై రౌడీషీటర్ ఉందని, 20 కేసులు కూడా ఉన్నాయని అయినా పోలీసులు అతడిని పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసిన వ్యక్తిని తక్షణమే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.