తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలు ఆదివాసీ సంఘాలతో నేడు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వివిధ సంఘాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం ముందుకు విన్నవించుకున్నారు. జైనూరులో జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివాసీలు, మైనారిటీ వర్గాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇరు వర్గాలతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు.ఈ నేపథ్యంలోనే ఆయా సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయా సంఘాల ప్రతినిధులు స్థానికంగా తాము ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తమ భూములు, ఉద్యోగాలు తమకే దక్కేలా చూడాలని కోరారు. ఆదివాసీల సమస్యలపై దీపావళిలోపు సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి తమను కూడా ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.