తెలంగాణ సమగ్ర కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతేడాది కుల గణన సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సర్వేకు ముందు కర్ణాటక, బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకొని సర్వే ప్రారంభించినట్లు చెప్పారు. రూ.125 కోట్లు ఖర్చు చేసి సుమారు 50 రోజుల పాటు గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే చేసి మొత్తం 1.12 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు చేశామన్నారు. తెలంగాణలో మొత్తం 96.9 శాతం సర్వే చేశామన్నారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారన్నారు.ఈ నివేదికను సంక్షేమ విధానాలను రూపొందించేందుకు వినియోగిస్తామని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ కుల గణన చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచే కుల గణన నివేదిక రూపకల్పనలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.