గోషామహల్లో నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి అఫ్జల్గంజ్లో ఉండగా గోషామహల్ స్టేడియంలో నూతన భవనాన్ని కట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాన్ని 26 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల పడకల సామర్థ్యంతో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దీని కోసం రూ.2500 కోట్ల నుంచి రూ.2700 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
వైద్య సేవలను తిరగరాసేందుకే…
ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. వందేళ్ల వైద్య సేవల చరిత్రను తిరగరాస్తూ…పేదల పెద్దాసుపత్రి నయా ఉస్మానియా దవాఖానకు నేడు గోషామహల్ లో శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. 26 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో… 32 లక్షల చదరపు అడుగులతో… 2000 పడకల సామర్థ్యంతో… అత్యాధునిక వైద్య సాంకేతికతతో… కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా కొత్త ఆసుపత్రి నిర్మాణం జరగబోతోందని పేర్కొన్నారు.