కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఓ ఐపీఎస్ ఆఫీసర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎల్బీ నగర్ డీసీపీ ఫుల్ టైం సెటిల్ మెంట్ దందాలు చేస్తూ పార్ట్ టైంలో ఉద్యోగం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు భూ వ్యవహారాల్లో పోలీసులకు ఏం పని అని ప్రశ్నించారు. అధికారుల విషయంలో సీఎం రేవంత్ చెప్పింది నిజమేనని, పోలీసుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మధుయాష్కీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. మీరు బ్యాగులతో దొరికారని…అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు అని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు అని పోస్టు చేశారు.