ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనం దొంగని సినిమాలో హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఈ సినిమాలో పీలింగ్స్ సాంగ్కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారని నారాయణ అన్నారు. ఇలా ఎంతోమంది మహిళలు ఆత్మాభిమానం చంపుకొని సినిమాల్లో పని చేస్తున్నారని తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరన్నారు. బెనిఫిట్ షోలకు , టికెట్ల ధరల పెంపునకు అనుమతించిన ప్రభుత్వంపైనా నారాయణ మండిపడ్డారు. డైరెక్టర్ సుకుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.