నేడు విజయనగరం జిల్లాలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డయేరియా బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన పవన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలలో చెత్తా చెదారం పడేస్తున్నారని.. గుర్ల గ్రామంలో బహిరంగ మలవిసర్జన ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు. దీన్ని ఆపకపోతే ఆరోగ్య పరంగా చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో ఎలాంటి డబ్బులు ఖర్చు చెయ్యలేదని.. పంచాయితీ నిధులు విడుదల చెయ్యలేకపోయారని విమర్శించారు. కనీసం ఫిల్టర్స్ కూడా మార్చలేకపోయారని, వారి తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయని చెప్పారు. ప్రధానితో మాట్లాడి నిధులు విడుదల చేసేలా చూస్తామన్నారు.