ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుంచి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కొంతకాలం క్రితం, విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్మెంట్ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అని పేర్కొన్నారు.