ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలో డయేరియా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఆరోగ్య కేంద్రంలోని డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులకు అందుతున్న చికిత్స, ప్రస్తుత పరిస్థితులపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గుర్లలో ప్రజలతో కొద్దిసేపు మాట్లాడారు. కాగా, తమ సమస్యలు చెప్పుకుందామని భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు. పవన్ కొద్దిమందితోనే మాట్లాడి వెనుదిరగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ నెల్లిమర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని పరిశీలించారు. పవన్ అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో వారిని అదుపుచేయలేక పోలీసులు ఇబ్బందులుపడ్డారు. సాయంత్రం విజయనగరం కలెక్టరేట్లో ప్రస్తుత పరిస్థితులపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారు.