తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఎంతగానో కృష్టి చేస్తోంది. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన శిక్షలు అమలు చేస్తోంది. అయినప్పటికీ కొన్ని చోట్ల పోలీసుల కళ్లు గప్పి డ్రగ్స్ వినియోగిస్తున్నారు. నగరంలో మరో డ్రగ్ పార్టీని పోలీసులు చేధించారు. మాదాపూర్లోని ఓ ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రియాంక రెడ్డి ఈ పార్టీ ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రగ్స్ హైదరాబాద్లో కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని కొరియర్స్ ద్వారా బెంగళూరు నుంచి తెప్పించి పార్టీ చేసుకున్నారు. ప్రియాంక స్నేహితురాలు, ఒడిశాకు చెందిన ఆర్కిటెక్ట్ షాకి, స్టాక్ ట్రేడర్ గంగాధర్, మరికొందరు పార్టీలో పాల్గొన్నారు. నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్తోపాటు మరో రెండు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు.