కాకినాడ పోర్టులో ఇటీవల రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీని వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు. తాజాగా అక్రమంగా తరలించిన బియ్యం స్టెల్లా షిప్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడించారు. బియ్యం ఎగుమతిదారు ఎవరు? ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామని తెలిపారు.షిప్లో ఉన్న బియ్యం పేదల బియ్యమేనా కాదా అనేది కూడా పరిశీలిస్తామన్నారు. ఈ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో టీం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, కస్టమ్స్, పౌరసరఫరాల శాఖ, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. అక్రమ బియ్యంపై ఎవరైనా సమాచారం ఇవ్వాలంటే 7993332244 నంబరుకు కాల్ చేయాలని సూచించారు.