తెలంగాణ ప్రజలు నిలదీసేందుకు గాంధీ భవన్ దాకా రాకముందే సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం చేసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ పై ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు రుణమాఫీ కాలేదని గాంధీ భవన్ వచ్చిన ఓ రైతు వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారని పేర్కొన్నారు. పాలకులను నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీ భవన్ కు చేరకముందే పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సూచించారు. గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాకా వస్తారని, ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించాలని చెప్పారు.ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి, అధికారులను వేడుకొని, వెనకడుగు వేయకుండా గాంధీ భవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి పట్టుదలను అభినందించారు.ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిచ్చారు.