పండుగ పూట తండ్రీ కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. నిర్మల్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీ కొట్టి తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. నర్సాపూర్ మండలం చాక్పెల్లి గ్రామం వద్ద ఈ దారుణం జరిగింది. సురేష్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బోథ్ మండలం కుచ్లాపూర్ నుంచి లోకేశ్వరం మండలం మన్మద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్(27), అతడి కుమారుడు దీక్షిత్(7) అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పండుగ పూట తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.