పిల్ల‌ల్ని చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ఏపీలోని ప‌శ్చిగోదావ‌రి జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ తండ్రి త‌న పిల్ల‌ను చంపి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాడేపల్లిగూడెంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. హోలీ సందర్భంగా చంద్రకిశోర్ తన భార్య తనూజను, ఇద్దరు కొడుకులు జోషిల్ (7), నిఖిల్ (6)ల‌ను తీసుకొని తన ఆఫీస్‌కి వెళ్లాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని నమ్మించి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లి పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి చంపేసి, చంద్ర‌కిషోర్‌ ఉరి వేసుకొని చనిపోయాడు. భర్త ఎంత సేపటికీ రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లింది. ఇంటి కిటికీలో నుంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. తలుపులు ప‌గ‌ల‌గొట్టి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగి విగ‌త‌జీవులై ఉన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోటు దొరికిందని పోలీసులు తెలిపారు. చంద్ర‌కిషోర్ అన్న ఈ ఘ‌ట‌న‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న త‌మ్ముడు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికి వాడు కాద‌ని దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *